Sunday, June 4, 2017

మహాసౌరయోగాలు - పరిహారాలు 1వ భాగం

కర్మ అనేది ఒక మతానికి సంబంధించిన అంశము కాదు. ఇది ఓ వ్యక్తికి సంబంధించినదిగా భావించాలి. కర్మను గురించి ఒకరు నమ్మినా నమ్మకపోయినా, కర్మ యొక్క నియమాలు, ఫలితాలు సర్వులకు వర్తిస్తుంటాయి. ప్రతివారు జన్మించిన తదుపరి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము జరిగి తిరిగి జననం కొనసాగుతుంటుంది. ఇది క్రమ పద్ధతి. కాలం కూడా అంతే. పగటి తర్వాత రాత్రి, రాత్రి తరువాత పగలు. తిరిగి రాత్రి, తిరిగి పగలు.. ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది.

ప్రతిరోజు మనం నీరు తాగుతూనే ఉంటాము. ఒకరోజు ఒక ప్రాంతంలో నీరు త్రాగవచ్చు, రేపు హైదరాబాద్ లో తాగవచ్చు, మరోరోజు మరో ప్రాంతంలో తాగవచ్చు. ఇంకో రోజు ఇంకో ప్రాంతంలో త్రాగవచ్చు. ఇలానే నిదురించటం కూడా.  అంటే జననం నుంచి మరణం వరకు ప్రతి రోజు ఏదో ఒక ఒక ప్రదేశంలో నీరు త్రాగటమో, ఏదో ఒక ప్రాంతంలో నిదురించటమో జరుగుతుంటుంది. దీనినే ప్రారబ్ద కర్మ అంటారు. ఇది రుణాన్ని బట్టి జరుగుతుంటుంది.

జీవి జన్మించగానే కొన్ని ఋణాలతో జన్మిస్తాడు. ఆ ఋణాలను ఈ జన్మలో తీర్చుకోవాలి. ఈ తీర్చటము అనేది గత జన్మలో చేసిన పాప పుణ్య కార్యాలను బట్టి ఈ జన్మలో శుభాశుభ  ఫలితాలనేవి ఉంటాయి. రామాయణంలోని యుద్ధ కాండలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది. 


శుభకృచ్చ్చుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే
విభీషణః సుఖం ప్రాప్తస్త్య ప్రాప్తః పాపమీదృశమ్ || 


ఉత్తమమైన పుణ్య కర్మలు చేసినవారికి ఉత్తమోత్తమ ఫలితాలు ఉంటాయి. పాప కర్మలు చేసిన వారికి దుఃఖం సంభవిస్తుంది, మరి విభీషణుడు తను చేసిన శుభ కర్మల వలన తనకు సుఖం లభించింది. నీవు (రావణుడు) పాపకర్మల చేసిన కారణంగా ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సివస్తున్నది అని మండోదరి రావణుడితో చెప్పింది.

కర్మల యొక్క ఫలితాలు అనుభవించేవాడు ఎవరు ? చేసినవాడే అనుభవించాలి. దుష్టమైనటువంటి కర్మలు చేసేవానికి తనకు తానే శత్రువవుతాడు. మంచికర్మలు చేసేవాడు తనకు తానే మిత్రుడవుతాడు. అంటే ప్రతి మనిషి తనకు తానే ఒక శత్రువుగా, మిత్రుడుగా, బంధువుగా, హితుడుగా, సన్నిహితుడుగా వివిధాలుగా ఉంటుంటాడు. వ్యక్తి చేసే శుభాశుభ కర్మలన్నింటికీ కూడా తానే సాక్షీభూతుడు. కాదంటారా ?

ప్రతివారు చేసే కర్మలకు (కార్యములకు) ఫలితాలు ఇలా ఉండాలి అని ఎవరు చెబుతున్నారు ? ఎవరు శాసిస్తున్నారు ? ఈ కర్మకి ఇలాంటి ఫలితం రావాలని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రపంచంలో ఉన్న కోటానుకోట్ల మంది చేసే కర్మలన్నింటినీ... ఎవరు, ఎక్కడ నుంచి ఎలా, ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారు ? దీనికి నిఘా కెమెరాలు వంటివి ఉన్నాయా ? ఉంటే ఎక్కడ ఉన్నాయి ? ఈ కెమెరాలు తీసే సారాంశమంత ఏ హార్డ్ డిస్క్లో సేవ్ అయింది ? ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ఉన్నాయి మరి. అలాంటి సమాధానాలను వేదంలోని చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు అందిస్తాయి. ఇట్టి ఉపనిషత్తే శ్వేతాశ్వతర ఉపనిషత్తు. అలాగే భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయంలోని 17 వ శ్లోకంలో గీతాచార్యులు ఏమన్నారంటే...


పితామహస్య జగతో మాతా ధాతా పితామహః
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజుర్వేద చ ||


ఈ సమస్తమైన విశ్వాన్నంతటినీ నేనే ధరించి ఉన్నాను. ప్రాణులు చేసే కర్మలన్నింటికీ ఫలితాలను నేనే అందిస్తున్నాను. తల్లిని నేనే, తండ్రిని నేనే, తాతను కూడా నేనే. నేనొక పవిత్రుడని, నేను ఓంకారాన్ని, ఋగ్వేద, యజుర్వేద, సామవేద సమూహాన్ని కూడా నేనే అని పరమాత్ముడు తెలియచేశాడు.

మనం జీవితాలలో జరిగే అనేక మార్పులను ఒక్కోసారి ఆపలేమేమోనని పలుమార్లు అనుకుంటుంటాం. ఒక్కోసారి మనం చేసే ఆలోచనలు, నిర్ణయాలు, ఇతరములు అనుకోకుండా తారుమారైపోతుంటాయి. ఆ సమయంలో మన గమనానికి సరియైన నియంత్రణ లేదని భావిస్తుంటాం. అప్పుడు అనుకుంటాం.. ఏమనో తెలుసా ? కాలం కలిసిరాలేదని కొందరు అనుకుంటుంటే, టైం బాగలేదేమో మరికొందరు, బాడ్ లక్ అని ఇంకొందరు అనుకుంటుంటారు. నిజంగా కాలం కలిసి రాలేదా ? నిజమే! ఈ కాలమనేది ఒకరికి కలిసి రాలేదు, ఇంకొకరికి కలిసి వచ్చింది కదా.. మరి కాలాన్ని తప్పు ఎలా పడతాం? నిజం చెప్పాలంటే కాలం కలిసి రాకపోవటం కాదు... ఈ కాల గమనంలో మనం చేసిన కర్మ ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగా ఉంటున్నాయి, ఒక్కోసారి ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేగాని కాలాన్ని నిందించకూడదు.

దీనిని బట్టి మన జీవన గమనములో అనేక రకాల ఆలోచనలతో ముందుకు వెళ్తుంటాం. విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తి కావచ్చు. ఇలా తమ తమ వ్యవహారాలతో పాటు గృహము, ఆరోగ్యము, వాహనము, తల్లి తండ్రులు, వివాహము, దాంపత్య జీవనము, సంతానము, సోదర సోదరీమణులు, స్నేహితులు, ఆర్ధిక లావాదేవీలు, శత్రువులు, ప్రమాదాలు, కీర్తి ప్రతిష్టలు, లాభ నష్టాలు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్లే వారు ఉన్నారు. నిత్యం కుస్తీ పడుతూ సాగేవారున్నారు. ఒక్కోసారి మంచి చెడుగా వెళ్తున్నవారు ఉన్నారు.

మన జాతకాలలో ఏమున్నది ? ఏం రాసి ఉన్నది? భవిష్యత్ జీవనం ఎలా గడవనుంది ? సంప్రదించగలమా లేక దారుణంగా దెబ్బతింటామా అనే భయాలతో కుమిలిపోయే వారు కూడా ఉంటారు. జాతకాలలో పరిస్థితులన్నీ సక్రమంగా ఉండి కూడా బాధపడుతున్న వారు ఎందరెందరో. అలా కాకుండా జాతక లోపాలుండి విజయ కేతనం ఎగరేసేవారు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా చదివిన తర్వాత మరి జాతకాలను నమ్మాలా, వద్దా అనే మీమాంసలో పడిపోతారు.

జాతకాలలో అంతర్గతంగా ఉన్న అంశాలను (అదృశ్యంగా ఉన్నవి ) తేటతెల్లం చేసి చెప్పే పండితులు ఉన్నప్పుడు మాత్రమే మీకు సరియైన అవగాహనతో ముందుకు వెళ్ళటానికి సలహాలను అందిస్తారు. అలాంటి పండితులు లేనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ పరంపరలో జాతకాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో లోపాలు, ఎన్నో దోషాలు ఉంటాయి. వీటిని చూసి కుమిలిపోరాదు. వీలైనంతవరకు చేతనైన రీతిలో పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే... లబ్ది పొందే అవకాశాలు వస్తుంటాయి.


మనం ఈ జన్మలో చేసే కర్యములన్నిటికి మనమే సాక్షిభూతుడుగా ఉన్నప్పటికీ... మనం గత జన్మలో చేసిన కార్యాల ఫలితాల ఆధారంగా ఈ జన్మలో ఓ టైం టేబుల్ లాగా నిత్యం  మనచేకర్మలను ఆచరింప చేస్తూ వాటి ఫలితాలను కూడా  అందించే ఓ పెద్ద మనిషి ఉన్నాడనే విషయాన్నీ మరువకూడదు. ఆ పెద్ద మనిషే కాలపురుషుడు. జగద్రక్షకుడు, ఈ విశాల విశ్వమంతటికీ వెలుగును ప్రసాదించి మన జీవితాలను పోషిస్తూ,  దైవంగా భాసిల్లే గ్రహారాజే శ్రీ సూర్యనారాయణుడు. 


అట్టి శ్రీ సూర్య భగవానుని గురించి తైత్తిరారణ్యకములోని ప్రధమ పాఠంలోనే ( వేదం ) 32 అనువాకలతో అరుణం అనే పేరుతో మంత్రభాగం ఉంటుంది.  దీనినే మహా సౌరం, నమస్కార ప్రశ్న అని కూడా అంటారు. నిత్యం భాసిల్లే సూర్య భగవానుని కిరణ ప్రసారంతో మన జీవిత గమ్యాలను ఓ క్రమబద్ధంగా మార్చుకోవటానికి మన మనస్సును , బుద్ధిని ప్రేరేపించాలి. ఈ విధంగా ప్రేరేపించటానికి అనేకానేక పద్ధతులు ఉన్నాయి. ఇందులో అందరూ సూక్ష్మంగా తెలుసుకొని పాటించటానికి జ్యోతిష శాస్త్ర రీత్యా మహాసౌర యోగాలు ఉపయోగపడతాయి.

ఈ మహాసౌర యోగాలు ప్రతినెలలో కొన్ని కొన్ని రోజులలో వస్తుంటాయి. ఆయా రోజులలో ఎలా ఎలా ఆచరిస్తే కొంతవరకు మనం విజయ బాటకు చేరువ కావటానికి అవకాశాలు ఉంటాయని పురాతన గ్రంధాలన్నీ చెబుతున్నాయి. ఈ పరంపరలో మహా సౌరయోగాలు - పరిహారాలు రెండవ భాగంలో మరికొంత వివరంగా పరిహారాలను తెలుసుకుందాం. (కొద్దిగంటలలో పోస్టింగ్ ఉండును) 

- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.