Saturday, January 16, 2016

రాహు కేతు యోగాలు, గోధుమపిండి దీపారాధన 2

నవగ్రహాలలో ఏడు గ్రహాలు పూర్తి స్థాయిలో జాతకునకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు, కేతువులు అనుకూలంగా లేకపోతే... ఆ జాతకునకు పరిస్థితులు దగ్గరకు వస్తూనే ఉంటాయి... కాని ఆనుభవించలేడు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతుంటారు. కాబోయే మంత్రిగారు అనే ప్రచారం కూడా బాగా సాగుతుంది. కాని రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో కాబోయే మంత్రి గారి పేరు గల్లంతవుతుంది.

చూశారా ఇలాంటి స్వల్ప అవయోగాలవలెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.

సప్త గ్రహాలూ అనుకూలించకపోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరించి... ఏక్ దిన్ కా సుల్తానా లాగా పదవిని అలంకరిస్తారు.  ఇలాంటి వారు ఆ సప్త గ్రహాలను తగిన రీతిలో అనుకూలించేలా తగు తగు పరిహారములు చేసుకుంటే ఈ పదవి పది కాలాలపాటు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే... రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా  అంత్య క్రియలు జరగటం కూడా ఈ చాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి.

కనుక ప్రతివారు సప్త గ్రహాలు యోగాలను ఇచ్చిననూ, ఇవ్వకపోయినను, రాహు కేతువుల యొక్క రాజయోగాన్ని సంపాదించటానికి కృషి చేస్తూ, ఈ యోగాన్ని శాశ్వత ప్రాతిపదికగా నిలుపుకోనేలా కూడా ప్రయత్నాలు చేయటానికి అనేక తాంత్రిక మార్గాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

అష్ట దిక్పాలకులలో ఉత్తరపు దిక్కునకు అధిపతిగా ఉండే దేవత పేరే కుబేరుడు. నవ గ్రహాలలో రాహు కేతువులను ఛాయా గ్రహాలుగా పేర్కొంటారు. రాహువు ఉత్తర ధృవమునకు అధిపతిగా ఉండే ఓ బిందువు. అలాగే కేతువు కూడా దక్షిణ ధృవానికి అధిపతిగా ఉన్న ఓ బిందువుగా పరిగణించాలి. జ్యోతిష శాస్త్ర రీత్యా రాహు, కేతువులు ఓ సర్పాకారంగా ఉంటారని రాహువు తల భాగంగాను, కేతువు తోకభాగంగాను ఉండును. ఈ రెండు గ్రహాలూ ఖగోళంలో అపసవ్యంగానే తిరుగుతుంటాయి. మిగిలిన ఏడు గ్రహాలూ గడియారంలో ముళ్ళులాగా సవ్యదిశలో తిరుగుతుంటారు.

రాహువు, కేతువుల మధ్యలో సవ్యంగా తిరిగే ఏడూ గ్రహాలూ ఉన్నప్పుడు, దానిని కాలసర్పయోగము అంటారు. కాని ప్రస్తుత రోజులలో ఈ విషయాన్ని అనేకమంది మర్చిపోయి కాలసర్ప దోషంగా చిత్రీకరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంటారు. ఉదాహరణకు కన్యా రాశిలో రాహువున్నాడు. మీనరాశిలో కేతువున్నాడు. మిగిలిన ఏడూ గ్రహాలూ ఈ రెండు గ్రహాల మధ్యనే ఉండాలన్నమాట. ఉదాహరణకు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో కేతువున్నాడు. రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. అనేకమంది పండితులు ఈ కేతువు చంద్రుడు ఉన్న స్థానాలను గమనించక... మీకు కాలసర్ప దోషం పట్టింది, సమస్యలు వెంటాడతాయి అని భయపెట్టి... పబ్బం గడుపుకుంటుంటారు. వాస్తవానికి ఉత్తరాభాద్ర నక్షత్రం తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది. గ్రహాలలో కేతువు తర్వాత ఇంకెవరూ ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటేనే అది కాలసర్పయోగమవుతుంది. పైన చెప్పిన ఉదాహరణకు కాలసర్పయోగం పట్టదు. అలా కాకుండా ఉత్తరాభాద్రలో చంద్రుడు ఉండి, రేవతిలో కేతువుంటే కాలసర్పయోగం పడుతుంది. అనగా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు.. వాటి వాటి ముందు వెనుకలను తెలుసుకోకుండానే భయపెడుతుంటారు.

కాలసర్పయోగం ఉన్నవారు తారాస్థాయిలో ఎంతోమంది ఉన్నారు. అబ్రహం లింకన్, జార్జ్ బుష్, ధీరుభాయ్ అంబాని... మహేశ్ యోగి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మెగాస్టార్ చిరంజీవి ఇలా ఎందరెందరో ఉన్నారు. కాలసర్పయోగం ఉన్నవారు ఒక రంగంలోనే ఉండాలి తప్ప రెండవ రంగానికి వెళ్ళకూడదు. కీర్తిశేషులు అంబాని వ్యాపార రంగంలోనే ఉన్నారు తప్ప రాజకీయ రంగంలోకి ప్రవేశించలేదు. అలాగే చిరంజీవి సినిమా రంగం కాకుండా రాజకీయ రంగం మీదకి వెళ్ళాడు. అందుకే ఈ రంగం ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కనుక కాలసర్ప దోషమనేది లేదు. కాలసర్పయోగమనేది ఉన్నది. పైగా పురాతన జ్యోతిష గ్రందాల సారాంశం ప్రకారం కాలసర్ప యోగం ప్రభావం వ్యక్తులకంటే కూడా సరిహద్దు ప్రాంతాలపైనే ప్రభావం ఉంటుందని స్పష్టమైనది. ఇక అసలు విషయంలోకి ప్రవేశిద్దాం.

రాహువు ప్రతిరోజు 90 నిముషాల పాటు రాహుకాలంగా ఒక్కో వారంలో ఉంటుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే 12 గంటల సమయంలో... సోమవారం రాహుకాలం ఏడున్నర గంటలకు, శనివారం 9గంటలకు, శుక్రవారం 10.30గంటలకు, బుధవారం 12 గంటలకు, గురువారం 1.30 నిముషాలకు, మంగళవారం 3 గంటలకు, ఆదివారం 4.30 గంటలకు ప్రారంభాలు జరుగుతుంటాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు ఏ వారానికి కూడా రాహుకాలం ఉండదు. కనుక ఈ 90 నిముషాల వ్యవధిలో మనం రాహువు యొక్క పరోక్ష యోగాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి.

మరి ఉన్న ఏడు రోజులలో ఏరోజున ఈ సమయాన్ని తీసుకోవాలి అనే అనుమానం ఉంటుంది కొందరికి. గ్రహ రాజు సూర్యుడు, సూర్యుని యొక్క వారమే ఆదివారం. కనుక సూర్య కుటుంబంలోనే ఈ గ్రహాలు సంచారం చేస్తుంటాయి. కనుక ప్రతి ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి 7.30 గంటల లోపలనే గోధుమపిండి దీపారాధన  ఆచరించాలి. అసలు ఈ గోధుమ పిండితో ఎందుకు చేయాలి ? చేశామనుకుందాం. ఎందుకు ఆ వెలుగును చూడాలి ? వెలుగును చూసినంత మాత్రాన లబ్ది  వస్తుందా ? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ప్రతివారికి ఉదయిస్తుంటాయి.

కనుకనే అలాంటి ప్రశ్నలు ఉదయించకుండా ఉండటానికే సుదీర్ఘమైన వ్యాసాలను అందిస్తున్నాను. కనుక రేపు వచ్చే ఆదివారమే దీపారాధన చేయాలని కాదండి. ప్రతి ఆదివారం దీపారాధన చేస్తూనే ఉందాం. వెలుగును చూస్తూనే ఉందాం. రాహు యోగాన్ని పొందుతూనే ఉందాం. అసలైన ఆసక్తికర వివరాల కోసం పోస్టింగ్ కాబోయే మూడవ వ్యాసంలోకి వెళదాం. విలువైన ఈ సమాచారాన్ని మీ బంధు మిత్రాదులకు పంపండి. - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.