Friday, November 20, 2015

నవంబర్ 30 రవి, శనుల కలయికతో తీవ్ర పరిణామాలా?

ఆధ్యాత్మికపరంగా ఓ వ్యక్తి సప్తవిధ శరీరాలతో ఉంటాడు. ఇందులో మొదటిది భౌతికమైనది. బాహాటంగా అందరికీ కనపడేది. రెండవది భావ శరీరము. ఇక మూడవది సూక్ష్మ శరీరము. నాల్గవది మానసిక శరీరము. పంచమ శరీరమే ఆధ్యాత్మిక శరీరం. విశ్వ శరీరమనేది ఆరవభాగంగా ఉంటుంది. చిట్ట చివరిది నిర్వాణ (మరణం) శరీరం.

పై సప్త శరీరాలలో నాల్గవదైన మానసిక శరీరానికి ఈ నెలలో ఓ సమస్య రావటానికి అవకాశాలను అందిస్తున్నాయి గ్రహస్థితులు. భారత కాలమాన ప్రకారం 2015 నవంబర్ 30 ఉదయం 5 గం.49 నిముషాల నుంచి ప్రతి వ్యక్తీ ఆలోచించే ప్రతి అంశంలోనూ ఓ వ్యతిరేకత ఉండి తీరుతుంది. శతాబ్దాల తర్వాత వస్తున్న ఓ గ్రహస్థితి ప్రతి వ్యక్తీ ఆలోచనా తరంగాలపై సమ్మెట పోటు వేయనున్నది.

ప్రతి మనిషిలో ఓ ఆలోచన ధోరణి ఉంటుంది. అది అనుకూలం కావచ్చు. ప్రతికూలం కావచ్చు. కానీ గ్రహచార స్థితిగతుల ప్రకారం 2015 నవంబర్ 30 సోమవారం నాడు వృశ్చిక రాశిలో ఉదయం 5 గం.49నిముషాలకు ఖగోళంలో రవి గ్రహ, శని గ్రహ కలయికలు జరుగుతున్నాయి.

మనః కారకుడైన చంద్రుని యొక్క వారమైన సోమవారం నాడు పుష్యమి నక్షత్రంలో ఈ అరిష్ట గ్రహస్థితి చోటు చేసుకోబోతున్నది. వ్యక్తి బడుగు జీవి కావచ్చు, లేదా ప్రధాని కావచ్చు. ఎవరు ఎవరైనప్పటికీ భారతదేశంతో పాటు, భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్డమ్ మరియు తూర్పు మధ్య దేశాలపై ప్రభావం వ్యతిరేకంగా ఉండనుంది. 

సెప్టెంబర్ మాసం నుంచి ప్రారంభమైన  106 రోజుల వ్యతిరేక అరిష్ట గ్రహస్థితుల ప్రభావం వాతావరణ, ప్రాకృతిక (భూకంప ఇత్యాదులు), రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక, సంగీత, సినిమా, రోడ్డు రైలు విమానయానములతో పాటు ద్వాదశ రాశులపై ప్రభావము ఉండునని గతంలోనే చెప్పటం జరిగింది. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్య రంగములపైన ప్రభావముండునని చెప్పటం జరిగింది. సెప్టెంబర్ నుంచి ఇంతవరకు భూకంప అంశాలను తీసుకుంటే దిన పత్రికలు, టీవీలలో తెల్పినవి కూడా పరిశీలిస్తే, మొన్నటి నెల్లూరులో జరిగిన ప్రకంపనలు, నిన్న 5.3 గా నేపాల్ లో వచ్చిన భూకంపము,ఈరోజు జపాన్లో 6.3గా వచ్చిన భూకంపం వరకు విశ్లేసిస్తే ఈ పోస్టింగ్ పెట్టే సమయానికి  106 రోజుల వ్యతిరేక స్థితులలో ప్రాకృతిక భూకంప తీవ్రతలు ఇంతవరకు 6.3 కంటే అధికంగా 23 ప్రాంతాలలోను, 5.0 కంటే తక్కువగా అనేక ప్రాంతాలలోను (ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది) వచ్చినవి.  అలాగే ఘోర విమాన ప్రమాదాలు, జల ప్రమాదాలతో పాటు అనేక వ్యతిరేకతలు కూడా ద్వాదశ రాశులలో ఉన్న వ్యక్తులకు ఆపాదిస్తున్నాయి.

ఈ 106 రోజుల వ్యతిరేక అరిష్ట గ్రహస్థితులలో భాగంగా నవంబర్ 30 న భారత కాలమాన ప్రకారం 5గం.49 నిముషాలకు ఖగోళంలో శని గ్రహం మరియు సూర్యుడు ఒకే బిందువులో కలవనున్నారు. ఆనాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ గ్రహ సంచారాలను విశ్లేషిస్తే దీని ప్రభావాలు ముఖ్యంగా రాజకీయ రంగంపైన, పరిపాలనా రంగాలపైన వ్యతిరేక ప్రభావాలు ఉంటుంటాయి. ప్రతివారి మనస్సు వ్యతిరేకంగా ఆలోచన చేయటము, నిర్ణయాలు తీసుకొనటానికి ప్రయత్నించటం జరుగును.

ప్రతి రాశిలోను మధ్య నక్షత్రంపై 50 శాతం ప్రభావం చూపును. మధ్య నక్షత్రానికి అటువైపు ఇటువైపు ఉండే నక్షత్రాలపై 25 శాతం వ్యతిరేక ప్రభావాలను చూపును. ఉదాహరణకు మేష రాశిలో మధ్య నక్షత్రమైన భరణి జాతకులకు 50 శాతం వ్యతిరేకంగాను, అశ్విని కృత్తిక జాతకులకు 25 శాతం చొప్పున వ్యతిరేకంగా మనోభావాలు ఉండును.  ఈ ప్రకారంగా భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, పూర్వాషాడ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర జాతకులకు రవి, శనుల కలయిక ప్రభావంచే మనస్సు 50 శాతం అధికంగా వ్యతిరేక భావాలవైపు లాగుచుండును. అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్ర, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి జాతకులకు 25 శాతం అధికంగా వ్యతిరేక నిర్ణయాలవైపు, ఆలోచనలవైపు మనస్సు మొగ్గుచూపుచుండును.

సెప్టెంబర్ 10 నుంచి ఇంతవరకు ప్రాకృతిక భూకంపాలు  వచ్చిన తీవ్రతను, ప్రాంతాలను, గ్రహస్తితులను దృష్టి లో ఉంచుకొని విశ్లేషిస్తే వృశ్చిక రాశిలో జరిగే రవి, శని గ్రహాల కలయిక ప్రభావం ఒక్క రోజు మాత్రమే ఉండదు. కనీసం 11 మాసాలపాటు వ్యతిరేకంగా ఉండును. రవి, శనుల ప్రభావంచే మనస్సు వివిధములైన వ్యతిరేక నిర్ణయాలను చేయును. కనుక పాఠకులు కొంత అప్రమత్తతతో ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా తొమ్మిది విధములైన వ్యక్తులతో శతృత్వము, విరోధము కలిగి ఉండరాదు. ఈ నవవిధ వ్యక్తుల వివరాలు మరియు రవి శనుల కలయిక తీవ్ర ప్రభావాలు తదుపరి పోస్టింగ్లో. 

- శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.