Tuesday, February 21, 2012

సప్తగ్రహ సందర్శనంతో శ్రీ ఖర ఫాల్గుణమాసం

      నక్షత్రాలు 27 , ఇందులో 24 వ నక్షత్రం శతభిషం. దీనికి అధిపతి రాహువు. ఈ శతభిషా నక్షత్రంతో ఖరనామ సంవత్సర ఫాల్గుణమాస శుక్ల పాడ్యమి ప్రారంభమై, శతభిషా నక్షత్రంలోనే ఫాల్గుణమాసం పూర్తికావటంతో, ఖరనామ సంవత్సరానికి మనం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ ఫాల్గునమాసంలోనే శుభగ్రహాలు ప్రజలందరికి దేదీప్యమానంగా దర్శనం ఇవ్వటానికి ఒకవైపు సిద్దమవుతుంటే, మరో వైపు మేమెందుకు దర్శనం ఇవ్వకూడదు అనుకున్నవేమో, పరస్పర శత్రుత్వం ఉన్నటువంటి పాప గ్రహాలైన కుజగ్రహము, శనిగ్రహము కూడా ఈ ఫాల్గునమాసంలో దర్శనమిస్తున్నాయి.
      

      వివరాలలోకి వెళ్తే ఈ ఫాల్గునమాసానికి ప్రారంభాంత్యాలలో శతభిషమనే  రాహు నక్షత్రం స్వాగత, వీడ్కోలు చేయనుంది.  ఈ ఫాల్గునమాసంలో రాత్రి సమయాలందు కించిత్ శతృత్వమున్న శుభగ్రహాలు, బద్ద  వైరమున్న పాపగ్రహాలను మనం దర్శించుకోబోతున్నాం.
       

      ఈ ఫాల్గునమాసంలో గురుగ్రహము తానున్న స్థానం నుంచి ప్రతి నిత్యం జరుగుతూ, జరుగుతూ పడమర దిశలో కిందికి వెళ్తుంటే , కించిత్ వైరమున్న శుక్ర గ్రహము తానున్న స్థానం నుంచి ప్రతి నిత్యం జరుగుతూ, జరుగుతూ గురు గ్రహానికి ఎదురుగా  పై దిశకు వెళ్తుంటాడు. ఈ పరంపరలో మార్చ్ 14 న మరో శుభగ్రహమైన బుధుని యొక్క బుధవారం నాడు, బుధుని నక్షత్రమైన జ్యేష్ట నక్షత్రం రోజున శుభ  గ్రహాలైన గురు, శుక్ర గ్రహాలు రెండూను ప్రజలందరికి పరిపూర్ణ దర్శనాన్ని ఇవ్వబోతున్నాయి. 
      
      ఈ అపూర్వ ఘట్టం మాస ప్రారంభం నుంచే సూర్యాస్తమయం తర్వాత మూడు లేక నాల్గు గంటలు మాత్రమే గురు, శుక్రులు కనపడుతుంటారు. మాస ప్రారంభంలో దూరంగా వుంది రోజు రోజుకి దగ్గరవుతారు. అలాగే ఫాల్గుణం ప్రారంభం నుంచే శుక్ర గ్రహము పడమర దిశలో అస్తమించాగానే కుజ గ్రహము తూర్పు వైపున మరింత ఎర్రని రంగులో దర్శనమిస్తుండగా, అదే తూర్పు దిశలోనే రాత్రి పది గంటల నుంచి శని గ్రహం దర్శనమిస్తు తెల్లవారు ఝామున అస్తమిస్తాడు. మరి పడమట దిశలోనే సూర్యుడు అస్తమించాగానే బుధ గ్రహం షుమారు 45 నిముషాలు దర్శనమిస్తుంది. 

  ఫిబ్రవరి 25  శని వారం నాడు విను వీదిలో సూర్యుడు అస్తమించిన తదుపరి షుమారు 40 నిముషాలు మాత్రమే గురు గ్రహము, దాని కింద శుక్ర గ్రహము, దాని కింద చవితి చంద్రుడు కనపడతాడు.  ఆ రోజే మహా విశిష్టమైన పుత్రగణపతి  వ్రత పర్వదినం కావటం మహా విశేషం. ముఖ్యంగా రాహు నక్షత్రంతో ఫాల్గుణం ప్రారంభమై రాహు నక్షత్రం తోనే ముగిసినందున... రాహు సంబంధ బాధలు, సమస్యలు లేకుండా వుండుటకై ..  నిత్యం శ్రీ  లలిత సహస్రనామం పారాయణం చేయువారు, శ్రీ దేవి ఖడ్గమాలా పారాయణం చేయువారు, ఇతర దేవి ఉపాసకులు ఫిబ్రవరి 25 నాటి మరియు మార్చ్ 14 నాటి అపూర్వ దృశ్యాలను భక్తీ తో వీక్షించినచో విశేష శుభప్రదం. నిత్యం దేవి ప్రార్ధనలు చేయని సామాన్యులు కూడా వుంటారు గనుక .. అలాంటివారు కూడ ఫిబ్రవరి 25 న గురు, శుక్ర, చంద్రులను , మార్చ్ 14 గురు, శుక్రులను భక్తీ తో వీక్షించి నమస్కరించుకున్నచో శుభములు కల్గునని పెద్దల నమ్మకం.
       పరోక్షంగా చెప్పాలంటే 7 వారాలకు అధిపతులుగా వుండే 7 గ్రహాలు, ఈ ఫాల్గుణ మాసంలో సమయాలు వేరైనా, దర్శనమివ్వటం శుభకరం, మహా శుభకరం. ఈ మాసంలో పంచ గ్రహ కూటమి వుందని  కొంతమంది భావిస్తుంటారు. పంచ గ్రహకూటమి ఈ మాసంలో లేనే లేదు. కేవలం సప్తగ్రహ సందర్శనం మాత్రమే జరుగుతున్నది. ఇట్టి అపూర్వమైన , అరుదైన, విశేషమైన, శుభకరమైన, మహా శుభకరమైన సప్తగ్రహ సందర్శనం సర్వులకు శుభాలను అందచేయాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి.


 - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ