Monday, September 20, 2010

చీకటిలేని రాత్రులతో గురుగ్రహ సందర్శనంతో మహాలయ పక్ష ప్రారంభం

ప్రస్తుతం గురుగ్రహం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రతి 13 మాసాలకొకసారి సూర్యునికి గురువుకి మధ్యలోకి భూమి వస్తుంది. ఈ పరంపరలో భూమికి గురువు చేరువలో వుంటే...... గురుగ్రహ దర్శనం కల్గుతుంది. వచ్చిన ప్రతిసారి దర్శనం కల్గవచ్చు, కలుగపోవచ్చు. 1967 లో గురుగ్రహం భూమికి చాలా దగ్గరగా రావటం, తిరిగి 2010 సెప్టెంబర్ 20 నుంచి గురుగ్రహానికి, సూర్యునికి మధ్యలోకి భూమి వచ్చి, గురువు భూమికి చేరువ కావటంచే ప్రకాశవంతమైన నక్షత్రంలాగా గురుగ్రహం కనువిందు చేయబోతున్నది.

సెప్టెంబర్ 20 అనగా నేటి రాత్రి నుంచే సూర్యుడు పశ్చిమాన అస్తమించగానే...... గురువు తూర్పు దిశలో ఉదయించటం, శుక్రగ్రహం కంటే దేదీప్యమాన వెలుగుతో దర్శనం ఇచ్చి....... తెల్లవారేసరికి గురువు పడమరలోకి వెళ్ళటం........ సూర్యుడు తూర్పున ఉదయించటం జరగనుంది. ఈప్రకారంగా గురువు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మధ్య వరకు భూమి మీద ప్రజలందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. మరొక విశేషం ఏమనగా సెప్టెంబర్ 23 న భాద్రపద పూర్ణిమ రోజు రాత్రి వరుసగా 3 రోజులు చీకటిలేని రాత్రులు కావటం ఒక విశేషమైతే, మీనరాశిలో చంద్రుని ప్రక్కనే గురువును కూడా దర్శించబోతున్నాము.

23 వ తేది భాద్రపద పూర్ణిమ గురువారం కావటం, ఆరోజు రాత్రి నుంచే వరుసగా మూడు రోజులు వరుసగా చీకటి లేకపోవటం విశేషం. ఏలయనగా 23 సాయంత్రం సూర్యుడు అస్తమించకముందే పూర్ణ చంద్రుడు ఉదయించటం, మరునాడు సూర్యోదయం తదుపరి పూర్ణ చంద్రుడు అస్తమించటం జరుగుతుంది. ఆవిధంగా 23, 24, 25 తేదీలలో పగటి సమయంలో సూర్యవెలుగుతో, రాత్రి సమయంలో చంద్రకాంతితో మహాలయ పక్షములు ప్రారంభం కానున్నవి.

ఈ సెప్టెంబర్ 20 నుంచి దర్శనం ఇచ్చే గురువు, తిరిగి 2022 లో మనకు దర్శనం ఇస్తాడు. ఈ గురు దర్శన సమయంలో లలితా సహస్ర నామ స్తోత్రంలో 129 వ శ్లోకం... "అదృశ్యా దృశ్య రహితా విజ్జ్ఞాత్రి వేద్యవర్జితా" అను పంక్తిని చదివి, ఆపైన గురు శ్లోకమైన "దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహసృతిం" అను శ్లోకాన్ని ఉచ్చరించి, ఆ పిదప శ్రీ దత్తాత్రేయిడుని ధ్యానం చేయండి.

మరి ముందుగా శ్రీ లలితాదేవిని ఎందుకు స్మరించాలి అని అనుకుంటారేమో ! ఇంద్రియములకు గోచారము కానిది అదృశ్యము. దృశ్యమనగా జగత్తునందలి సర్వవస్తు సముదాయము. చూస్తూ కూడా బయట వస్తువుని చూడని స్థితిని దృశ్యరహిత స్థితి అంటారు. ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో దానిని వేద్యమైనది అంటాము. ఇక తెలుసుకోవాల్సింది ఏమిలేదు అనుకుంటే... దానిని వేద్యవర్జిత అంటారు... ఎవరైతే సర్వము తెలిసి ఉంటారో, అలాంటి విజ్ఞానమూర్తులనే విజ్ఞాత్రులు అంటారు.

గనుక లలితాదేవి తనకు బయటా లోపల అనుబేధం లేక సర్వము తానగుటచే తనకు తెలియవలసినదేమీ లేదు. అందుచే ఆమె వేద్యవర్జిత. అట్టి విజ్ఞానమూర్తి గనుకనే ఆమె విజ్ఞాత్రి అనబడింది.... ఇటువంటి దేవతను, ఆయా నామాల అనుష్ఠానం వలన, ఇంతవరకు అదృశ్యంగావుండి, ఇప్పుడు దర్శనం ఇచ్చే గురువుని దర్శించటానికి తగిన సమర్ధతను, శక్తిని మనకు అనుగ్రహం కల్గటానికే... ఆ తల్లిని ముందు.. ఆయా నామాలతో ధ్యానించుకుందాం.

ధ్యానించండి... అనుగ్రహాన్ని పొందండి..

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.