Tuesday, September 28, 2010

కుజదోషంపై నిజానిజాలు - 2

కుజదోషం అని పండితులు చెప్పగానే వధూవరుల తల్లితండ్రులు కుమిలి కుమిలి పోతుంటారు. అలా బాధపడే వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే..."కుజదోషంపై నిజానిజాలు" రెండవ భాగమును ఇవ్వటము జరిగింది

జాతకాలలో కుజగ్రహం జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, స్థానాలలో వుంటే కుజదోషముండునని మొదటి భాగం లో తెలుసుకున్నాము. మరి ఈ కుజదోషం కొందరికి వర్తించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరెవరికి ఈ కుజదోషం వర్తించదో ముందు తెలుసుకుందాం.

జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుజగ్రహం తన నీచస్థానమైన కర్కాటక రాశిలో వుండి వుంటే, అట్టివారికి కుజదోషం వర్తించదని భావం. అలాగే కుజుడికి తన స్వక్షేత్రములైన మేష వృశ్చిక రాశులలో గానీ, ఆయా లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. కుజగ్రహానికి మిత్రులైన రవి గురుల రాశులైన సింహ, ధనుస్సు, మీన రాశులలో గానీ, లగ్నాలలో గానే జన్మించివుంటే కుజదోషము వర్తించదు. కుజగ్రహానికి ఉచ్చస్థానమైన మకరరాశి యందు లేక మకరలగ్న మందు జన్మించిన వారికి కుజదోషము వర్తించదు.

మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర, మీన రాశులలో గానీ, లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం భంగమగునని, భయపడవలసిన అవసరం లేదని........ పైన పేర్కొన్న పేరా సారాంశం. మొత్తం 12 రాశులలో 7 రాశుల జాతకులు పోనూ..... మిగిలిన అయిదు రాశుల జాతకులకు కుజదోషం వుంటే భంగం కాదనే కదా సారాంశం. మరి ఆ రాశులు ఏమిటంటే... వృషభ, మిధున, కన్య, తుల, కుంభ రాశులు... మరి ఈ రాశులలో మాత్రమే గాక మొత్తం 12 రాశులలో ఏ రాశివారికైన కుజదోషం వుండి వుంటే, వారి జాతకంలో కుజుడిని, గురుగ్రహం విశేష దృష్టులతో చూస్తూవుండిననూ కుజదోషం వర్తించదనే శాస్త్ర నిర్ణయములున్నవి.

పై నిర్ణయములు గాక రెండవ స్థానంలో కుజుడు దోషరూపంలో వుండి... వారు మిధున కన్యారాశులలో గానీ, మిధున కన్యాలగ్నాలలోవుండిన కుజదోషం వర్తించదనే శాస్త్రప్రమాణమున్నది. అనగా 4, 7, 8 స్థానాల దోషం భంగపడదు. కేవలం రెండవ స్థాన దోషం భంగమగునని ఉద్దేశ్యం. మరి ఈ విషయం 2 వ స్థాన దోషం వారికి ఊరట నిచ్చే మాట.

నాల్గవ స్థాన కుజదోషం వున్నవారు మేష వృశ్చిక రాశులలో గానీ, మేష వృశ్చిక లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. అంటే 2, 7, 8 స్థానాల లోపం ఉంటుందని భావం. అలాగే సప్తమ స్థానంలో కుజదోషం వున్నవారు మకర కర్కాటక రాశులలో గానీ, మకర కర్కాటక లగ్నాల యందు గానీ జన్మించి వుంటే 7 వ స్థాన కుజదోషం భంగమగునని, రెండు, నాలుగు, ఎనిమిది స్థానాలలో భంగం కాదని శాస్త్ర నిర్దేశం.

ఇక అష్టమ స్థాన కుజదోషం వున్నవారు ..... ధను, మీన రాశులలో లేక లగ్నాలలో జన్మించి వుంటే.... వారికి అష్టమ స్థాన కుజదోషం వర్తించదు. ఈ కుజదోషమనేది జన్మ లగ్నం నుంచే వుంటుంది. జనం లగ్నం నుంచే లెక్కించాలి. చంద్రుడు ఉన్న రాశి నుంచి, శుక్రుడు ఉన్న రాశి నుంచి, కుజ దోష స్థానాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం వుండి తీరుతుంది. ఇది సరియిన సక్రమమైన వివరం కాదు. కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే కుజదోషాన్ని లెక్కించాలి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి అను పదమూడు నక్షత్రములలో జన్మించిన వారికి కుజగ్రహం... ఏ స్థానంలో ఉన్ననూ.. కుజదోషం ఉండదని శాస్త్ర నిర్దేశము. ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన ఏ ఒక్కరూ కుజదోషం గురించి బెంగ పడాల్సిన అవసరం లేనేలేదు. కుజదోషం ఉన్ననూ.. దైర్యంగా వుండండి... ఎలా ఉంటాము దైర్యంగా ? అని అనుకుంటున్నారా.... నిజమే మరి అసలుసిసలైన వాస్తవాలను తదుపరి కుజదోషంపై నిజానిజాలు - 3 అను పోస్టింగ్ కొరకు వేచి చూడండి... నగ్న సత్యాలను తెలుసుకోండి.

Tuesday, September 21, 2010

కుజదోషంపై నిజానిజాలు - 1


వివాహ ప్రయత్నాలు ఆలశ్యమవుతున్నా, వివాహమైన తదుపరి సమస్యలు తలెత్తుతున్నా, అందరికీ వెంటనే గోచరించేది కుజదోషం. కుజదోషం వున్నవారు కుజదోషం వున్న వారినే వివాహమాడాలని అంటాము. మరి ఈ కుజదోషం ఎవరెవరికి వుంటుంది ? నిజంగా కుజదోషమున్నవారికి లేదని, కోజదోషం లేనివారికి వున్నదని చెప్పే పండితులు కూడా ఈమధ్యకాలంలో సిద్ధమవుతున్నారు. ఏ చిన్నపాటి సమస్యకైనా, ఓ పండితుడిని దంపతులు గానీ, దంపతుల తల్లితండ్రులు గానీ విచారించగానే, ముందుగా ఆ పండితుల వారు సెలవిచ్చేది కుజదోషం వుందని లేక కాలసర్పదోషముందని, ఈ కుజదోషం వలన భార్య భర్తలలో ఒకరికి మరణం త్వరలో వుందని, భయభ్రాంతులయ్యే సంభాషణలతో పండితుడు చెప్పగానే, ఆ మాటలు విన్న దంపతులకో లేక వారి తల్లితండ్రులకో ప్రాణాలు అప్పుడే గాలిలో కలిసిపోయే విధంగా వుంటాయి.


ఈ కుజదోషం గురించిన సంపూర్ణ చరిత్రను గురించి తెలుసుకుంటే ఎవరు... ఏ మాట చెప్పినా భయపడాల్సిన అవసరము వుండదు. రాశి చక్రములో మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. అగ్నితేజో సంపన్నుడు. ఇట్టి కుజుడు జాతక చక్రములో జన్మ లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజదోషం వుందని భావం. మరి 2 వ స్థానంలో కుజుడు వుంటే... కుటుంబ ధన సంపత్తులు కొన్ని కొన్ని కారణాల వలన హరించుకుపోతాయని భావం. ఇక 4 వ స్థానంలో కుజుడు వుంటే గృహలక్ష్మి భాగ్యములు దెబ్బతినటం, వాహన సంభందిత ప్రమాదములు, ఆరోగ్య లోపములు ఏర్పడునని గ్రహించాలి. 7 వ స్థానంలో కుజుడు వుంటే కళత్ర సుఖ భోగ భాగ్యములు తగ్గిపోవునని, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు ప్రారంభమగునని భావం. 8 వ స్థానంలో కుజుడుంటే ఆయుర్భాగ్యం తగ్గునని, పూర్ణ ఆయుర్దాయమునకు దూరమని భావం. 12 వ స్థానంలో కుజుడు వుంటే మోక్షలక్ష్మీ భాగ్యములు అంతరించి పోతాయని విశ్వసించాలి. కుజుడు ఆయా స్థానాలలో వుండిన పురుషునికి భార్య వియోగము, భార్యకు భర్త వియోగము కల్గును.


ఈ వియోగం ఎప్పుడు కలుగుతుంది ? వివాహం కాగానేనా ? లేక కొన్ని సంవత్సరాలు దాంపత్యం జరిగిన తదుపరా ? ఖచ్చితమైన సమాధానం ఏమిటంటే... ఏ జాతకులైన కుజదోషం వుంటే.... దాని ప్రభావం, కుజ మహాదశ జరిగే సమయంలోనే సమస్యలు వస్తాయి. ముందు రానే రావు. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మొట్ట మొదట గ్రహించాలి. ఇక 27 నక్షత్రాలలో జన్మించిన వారి వివరాలలోకి వెడితే అందరికీ తెలియని ఆసక్తికర అంశాలెన్నో రేపటి రెండవ భాగంలో తెలుసుకుందాము.

Monday, September 20, 2010

చీకటిలేని రాత్రులతో గురుగ్రహ సందర్శనంతో మహాలయ పక్ష ప్రారంభం

ప్రస్తుతం గురుగ్రహం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రతి 13 మాసాలకొకసారి సూర్యునికి గురువుకి మధ్యలోకి భూమి వస్తుంది. ఈ పరంపరలో భూమికి గురువు చేరువలో వుంటే...... గురుగ్రహ దర్శనం కల్గుతుంది. వచ్చిన ప్రతిసారి దర్శనం కల్గవచ్చు, కలుగపోవచ్చు. 1967 లో గురుగ్రహం భూమికి చాలా దగ్గరగా రావటం, తిరిగి 2010 సెప్టెంబర్ 20 నుంచి గురుగ్రహానికి, సూర్యునికి మధ్యలోకి భూమి వచ్చి, గురువు భూమికి చేరువ కావటంచే ప్రకాశవంతమైన నక్షత్రంలాగా గురుగ్రహం కనువిందు చేయబోతున్నది.

సెప్టెంబర్ 20 అనగా నేటి రాత్రి నుంచే సూర్యుడు పశ్చిమాన అస్తమించగానే...... గురువు తూర్పు దిశలో ఉదయించటం, శుక్రగ్రహం కంటే దేదీప్యమాన వెలుగుతో దర్శనం ఇచ్చి....... తెల్లవారేసరికి గురువు పడమరలోకి వెళ్ళటం........ సూర్యుడు తూర్పున ఉదయించటం జరగనుంది. ఈప్రకారంగా గురువు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మధ్య వరకు భూమి మీద ప్రజలందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. మరొక విశేషం ఏమనగా సెప్టెంబర్ 23 న భాద్రపద పూర్ణిమ రోజు రాత్రి వరుసగా 3 రోజులు చీకటిలేని రాత్రులు కావటం ఒక విశేషమైతే, మీనరాశిలో చంద్రుని ప్రక్కనే గురువును కూడా దర్శించబోతున్నాము.

23 వ తేది భాద్రపద పూర్ణిమ గురువారం కావటం, ఆరోజు రాత్రి నుంచే వరుసగా మూడు రోజులు వరుసగా చీకటి లేకపోవటం విశేషం. ఏలయనగా 23 సాయంత్రం సూర్యుడు అస్తమించకముందే పూర్ణ చంద్రుడు ఉదయించటం, మరునాడు సూర్యోదయం తదుపరి పూర్ణ చంద్రుడు అస్తమించటం జరుగుతుంది. ఆవిధంగా 23, 24, 25 తేదీలలో పగటి సమయంలో సూర్యవెలుగుతో, రాత్రి సమయంలో చంద్రకాంతితో మహాలయ పక్షములు ప్రారంభం కానున్నవి.

ఈ సెప్టెంబర్ 20 నుంచి దర్శనం ఇచ్చే గురువు, తిరిగి 2022 లో మనకు దర్శనం ఇస్తాడు. ఈ గురు దర్శన సమయంలో లలితా సహస్ర నామ స్తోత్రంలో 129 వ శ్లోకం... "అదృశ్యా దృశ్య రహితా విజ్జ్ఞాత్రి వేద్యవర్జితా" అను పంక్తిని చదివి, ఆపైన గురు శ్లోకమైన "దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహసృతిం" అను శ్లోకాన్ని ఉచ్చరించి, ఆ పిదప శ్రీ దత్తాత్రేయిడుని ధ్యానం చేయండి.

మరి ముందుగా శ్రీ లలితాదేవిని ఎందుకు స్మరించాలి అని అనుకుంటారేమో ! ఇంద్రియములకు గోచారము కానిది అదృశ్యము. దృశ్యమనగా జగత్తునందలి సర్వవస్తు సముదాయము. చూస్తూ కూడా బయట వస్తువుని చూడని స్థితిని దృశ్యరహిత స్థితి అంటారు. ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో దానిని వేద్యమైనది అంటాము. ఇక తెలుసుకోవాల్సింది ఏమిలేదు అనుకుంటే... దానిని వేద్యవర్జిత అంటారు... ఎవరైతే సర్వము తెలిసి ఉంటారో, అలాంటి విజ్ఞానమూర్తులనే విజ్ఞాత్రులు అంటారు.

గనుక లలితాదేవి తనకు బయటా లోపల అనుబేధం లేక సర్వము తానగుటచే తనకు తెలియవలసినదేమీ లేదు. అందుచే ఆమె వేద్యవర్జిత. అట్టి విజ్ఞానమూర్తి గనుకనే ఆమె విజ్ఞాత్రి అనబడింది.... ఇటువంటి దేవతను, ఆయా నామాల అనుష్ఠానం వలన, ఇంతవరకు అదృశ్యంగావుండి, ఇప్పుడు దర్శనం ఇచ్చే గురువుని దర్శించటానికి తగిన సమర్ధతను, శక్తిని మనకు అనుగ్రహం కల్గటానికే... ఆ తల్లిని ముందు.. ఆయా నామాలతో ధ్యానించుకుందాం.

ధ్యానించండి... అనుగ్రహాన్ని పొందండి..

Thursday, September 9, 2010

గణేశ చతుర్ధిన వినువీధిలో అరుదైన తారా శాశాంకం


విఘ్నాలను తొలగించి, సకల శుభాలను అందించే గణనాధుడిని భక్తి ప్రపత్తులతో అర్పించే భాద్రపద శు. చవితి "గణేశ చతుర్ధీ" పర్వదినాన రాత్రి సమయములలో చంద్ర దర్శనము చేసిన వారాలకు నిందలు తప్పవని పురాణ వచనము. కానీ గణపతి పూజను చక్కగా ఆచరించుకొని, వ్రతకధను విని, అక్షతలను శిరస్సు మీద ఉంచుకొన్న వారు చంద్ర దర్శనము చేసినచో దోషము కాదు. నిందలు వుండవు. కొతమంది వ్రతం ఆచరించి, కధ విని, అక్షతలు శిరస్సున వేసుకున్ననూ..... చంద్ర దర్శనం చేయరు. ఎందుకంటే....... నిందలు పడతాయనే భయం వెంటాడుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.

కానీ శ్రీ వికృతి నామ సంవత్సరంలో భాద్రపద శు.చవితి శనివారం 11 సెప్టెంబర్ 2010 వినువీధిలో మహాద్భుతమైన అపురూప అరుదైన దృశ్యం చూడబోతున్నాము. అదే తారా శాశాంకుల సయ్యాట, దోబూచులాట.... నెలవంక పక్కనే ధగధగమెరిసే నక్షత్రం కనువిందుచేయనుంది. ఇది వినాయక చతుర్ధి పర్వదినం నాడే దర్శనం అవుతుంది. ప్రతి 8 సంవత్సరములకొకసారి గణేశ చతుర్ధిన సాయంకాల సమయములలో శుక్ర గ్రహం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో కలిసిన కారణంగా, నెలవంక ప్రక్కన శుక్ర నక్షత్రం మిలమిల మెరుస్తూ వుంటుంది. గతంలో 2002, 1996, 1988, 1980, సంవత్సరాలలో దర్శనం అయింది.

మరి ఈ వినాయక పర్వదినం రోజున హైదరాబాద్ నగరంలో చంద్రుడు రాత్రి 6 గంటల 57 నిమిషాలకు అస్తమిస్తాడు. సూర్యుడు 6 గంటల 5 నిమిషాలకు అస్తమిస్తాడు. ఈ మధ్యకాలంలో చవితి చంద్రుడు శుక్రగ్రహం పక్కనే ఉంటాడు. దాదాపు 2 ఘడియలు ఈ దృశ్యాన్ని తిలకించవచ్చు. భక్తి ప్రపత్తులతో సేవించవచ్చు. ఇతర మతస్తులు ఇష్ట దైవంగా కూడా భావిస్తారు. మన గణనాయకుని జన్మదినాన వినాయక వీధిలో ఏర్పడే తారా శాశాంకాన్ని కనులవిందుగా చూసి తరించండి. తిరిగి రాబోయే విళంబి నామ సంవత్సర భాద్రపద శు.చవితి గురువారం 2018 సెప్టెంబర్ 13 న వచ్చే గణేశ చతుర్ధి రోజున, ఆపై రాబోయే పరాభవ నామ సంవత్సర భాద్రపద శు.చవితి మంగళవారం 2026 సెప్టెంబర్ 15 న వచ్చే గణేశ చతుర్ధి రోజున శుక్రగ్రహం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో కలిసినందున కనువిందుచేసే తారా శాశాంకుల సయ్యాట వుంటుంది.

ఆకాశంలో ఆసమయంలో మేఘాలు కమ్ముకోనకుండావుంటే అదృష్టమే మరి.... ఇంతటి అరుదైన, అద్భుత, అదృష్ట దృశ్యాన్ని తిలకించే మహాభాగ్యం ఎంతమందికి వుంటుందో వేచి చూడాలి మరి.