Friday, July 24, 2009

ఈ శతాబ్ది రెండవ శుక్రగ్రహణం 2012 లో.. 2012 వివరాలపై సీ..రియల్ పోస్టింగ్స్ - 1

2012 లో ఏమి జరగనుంది ? ..... ప్రతి ఒక్కరు ఏదో జరుగుతుంది అనే భయంతో వణికిపోతున్నారు. ప్రధాన కారణాలు ఏమిటి?.... మయాన్ కాలెండరు నిజమే చెబుతుందా?..... ప్రపంచం వినాశనమగుననే ప్రచారం నిజమేనా ? .... ఇంతటి ప్రచారానికి అడ్డుకట్ట వేయలేమా? ... ప్రసార మాధ్యమాలు, ఇంటర్నెట్ విశేషాలు ప్రపంచ ప్రజలకు నగ్న సత్యాలే తెలుపుతున్నాయా? లేక తప్పు సమాచారం అందిస్తున్నాయా?... ఈ విషయం లో వైజ్ఞానిక శాస్త్రం ఏముంటుంది?.... వేదాలు ఏమని ఘోషిస్తున్నాయి?.. జ్యోతిష్య శాస్త్రం తెలిపేది ఏమిటి? ... ఎన్నో.. ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి... ప్రపంచ ప్రజలు మాత్రం 2012 ప్రపంచ అంతం అనే మాటతో అట్టుడికిపోతున్నారు..... దీనిలో భాగంగా 2012 లో గ్రహ స్థితులు ఎలా వున్నాయి?... గ్రహణాలు ఎలా వున్నాయి?.. ప్రభావాలు ఎలా వుంటాయి? ... చివరికి ఫలిత సారాంశం ఏమిటి? అని ఆసక్తికర నగ్నసత్యాలతో 2012 సీరియల్ పోస్టింగ్స్ నేటినుంచే సీరియల్ గా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో మొదటి పోస్టింగ్ గా ఈ 21 వ శతాబ్దపు రెండవ శుక్ర గ్రహణ వివరాలను మీ ముందువుంచుతున్నాను.

శుక్ర గ్రహణ మేమిటని .... అనుకుంటున్నారా?... అవును. నిజమే గ్రహణాలు సూర్య చంద్రులకే కాదు. మిగిలిన గ్రహాలకు కూడా అరుదుగా వస్తుంటాయి. రాహువు లేక కేతువుతో కలిసిన ఓ సరళరేఖపైకి భూమి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సాధారణంగా సూర్య గ్రహణం జరుగుతుంది. అలాగాకా సూర్యునికి భూమికి మధ్య చంద్రుడి బదులు శుక్రుడు వచ్చినచో.... శుక్ర గ్రహణం ఏర్పడి...శుక్ర గ్రహం ఒక గుండుసూది ఆకృతిలో సూర్యుని బింబముపై నల్లని చుక్కలా గోచరమవుతుంది.

ఈ శతాబ్దిలో తారణ నామ సంవత్సరంలో జైష్ట బహుళ షష్టి మంగళవారం ది 8 జూన్ 2004 దిన శుక్ర గ్రహణం ఏర్పడి శతాబ్ది తొలి శుక్ర గ్రహణం సూర్యబింబంపై కనువిందు చేసినది. ఈ వైనము మా తారణ సంవత్సర 6 వ పేజీలో పేర్కొన్నాము. ఇలాగే రాబోవు నందన నామ సంవత్సర జ్యేష్ట బహుళ విదియ బుధవారము పూర్వాషాడ నక్షత్ర దినము ది 6 జూన్ 2012 దిన, వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో కేతు గ్రస్తంగా శతాబ్ది రెండవ శుక్ర గ్రహణం సంభవించనుంది. గత తారణ సంవత్సరంలో ( 2004 - 05 ) వచ్చిన శుక్ర గ్రహణం ప్రారంభం నుంచి అంత్యం వరకు భారతదేశంలో గోచరమైనది.

ఈ 2012 లో వచ్చే శుక్ర గ్రహణం ప్రారంభ సమయం భారతదేశంలో రాత్రి భాగమైనందున గ్రహణ స్పర్శను భారతదేశంలో చూడలేకపోతున్నాము. గ్రహణ మధ్య కాలమునకు ఒక గంట ముందు నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సూర్యోదయాలు అయినందున..... మనమందరమూ అతి స్పష్టంగా మసి పూసిన అద్దముతో కానీ, ఫిలింతో కానీ, సోలార్ ఫిల్టరు తో కానీ.... సూర్యబింబంపై కదిలి వెళ్ళే గుండుసూది మొన ఆకృతి గల శుక్ర గ్రహాన్ని నల్లని చాయలో దర్శించుకొనవచ్చును. సూర్య బింబము ఒకవైపు వెలుపలి అంచు నుంచి.... రెండవ వైపు వెలుపలి అంచు వరకు శుక్రుడు 400 నిమిషాల సేపు ప్రయాణం చేస్తాడు..... అంటే .... 6 గంటల 40 నిమిషాలు అన్నమాట. సూర్య బింబం ఓ వైపు లోపలి అంచు నుంచి... మరో వైపు లోపలి అంచు వరకు శుక్ర గ్రహణం కనపడే సమయము 364 నిమిషాలు.... అంటే.... 6 గంటల 4 నిమిషాలు అన్నమాట.

ఉత్తరార్ధ గోళములో ఈశాన్య స్పర్శతో ప్రారంభమైన గ్రహణ శుక్రుడు... వాయివ్య భాగంలో మోక్షమునొందును. ఆద్యంతం పుణ్యకాలము 6గంటల 4 నిమిషాలు అన్నమాట. భారత కాలమానం ప్రకారం 2012 జూన్ 6 సూర్యోదయానికి పూర్వము 3 గంట 21 నిమిషములకు శుక్రుడికి గ్రహణం స్పర్శించును. ఈ స్పర్శను భారతంలో రాత్రి సమయమందున వీక్షించలేము. శుక్ర గ్రహణ మధ్య కాలము 6 ఉదయం 6 గంటల 59 నిమిషాలు. శుక్ర గ్రహణ అంత్య కాలము ఉదయము 10 గంటల 01 నిమిషములు. భారతదేశంలో సూర్యోదయాలు జరిగనప్పటి నుంచే, అన్ని ప్రాంతాలలో నల్లని గుండుసూదిమొన లాంటి మచ్చతో శుక్ర గ్రహణం దర్శనమగును.... అంటే మచ్చతోనే సూర్యబింబం దర్శనమిస్తుంది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. ఉత్తర అమెరికాలో వాయువ్య భాగం, పచ్చిమ ఫసిఫిక్, ఉత్తర ఆశియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, తూర్పు మధ్య యూరప్, తూర్పు ఆఫ్రికా ప్రాతాలలో శుక్ర గ్రహణం కనపడుతుంది. పోర్చుగల్, దక్షిణ స్పెయిన్, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో గ్రహణం కనబడదు.

ఈ 2012 లో కనపడే శుక్ర గ్రహణ సమయంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. శుక్ర గ్రహణం రావాలంటే.... ఆ సమయంలో శుక్ర మూడమి ఏర్పడి వుండాలి. శుక్ర మూడమి ఏర్పడకుండా శుక్ర గ్రహణం రానేరాదు. అందుచేత జూన్ 2012 మొదటి పది రోజులలో శుక్ర మూడమి వుంటుంది. 2012 లో సీ.... రియల్ పోస్టింగ్స్ లో ఈ వ్యాసాన్ని మొదటిగా భావించండి.. ఈ గ్రహణ ఫలితాలు ఎలా వుంటాయి అనే ఆసక్తికర అంశాలకై 2012 వరుస పోస్టింగ్స్ ని క్రమం తప్పకుండా చదవండి... విశేషాలకై ఎదురు చూస్తూ వుండండి.. ..


శ్రీనివాస గార్గేయ

Thursday, July 23, 2009

నాగపంచమిన నాగవల్లీ పత్రంతో నాగారాధన

ఈ విరోధి నామ సంవత్సరంలో 16 జూలై 2009 గురువారం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాలకు........... శ్రీ సూర్యభగవానుడు పునర్వసు నక్షత్ర నాల్గవ పాదప్రవేశంతో కర్కాటక సంక్రమణం జరిగింది. అంటే..... అదే దక్షిణాయన ప్రారంభమన్నమాట.... ఈ రోజునే కర్కాటక సంక్రాంతి అంటారు. అలాగే 14 జనవరి 2010 గురువారం మద్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు........ శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాడ నక్షత్ర రెండవ పాదప్రవేశంతో మకర సంక్రమణం జరుగుతుంది. .... అంటే ఆ రోజు ఉత్తరాయణ ప్రారంభం... మకర సంక్రాంతి అన్నమాట....

ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే ఆషాడ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశిలో 22 జూలై 2009 న జరిగిన విశేషం మనకు తెలిసినదే.......... ఈ సంపూర్ణ గ్రహణం ఉత్తర భారతదేశంలో పుణ్యక్షేత్రమైన గయా, వారణాసి, ఉజ్జయినీ లలో సంపూర్ణంగా గోచరించినది...... అలాగే ఉత్తరాయణం ప్రారంభమైన రెండవ రోజే, అనగా పుష్య అమావాస్య 14 జనవరి 2010 న మకర రాశిలో రాహుగ్రస్తంగా సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రామేశ్వరం, తిరుచందూర్ లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో కంకణంతో దర్శనం కాబోతున్నది.

ప్రతి సంవత్సరం ఆషాడ అమావాస్య, పుష్య అమావాస్య దినములలో పుణ్య నదులలో స్నానాలు ఆచరిస్తూ.... పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయటం సనాతన భారతీయ సాంప్రదాయం. అయితే ఈ రెండు అయనాలు ప్రారంభమైన వెంటనే గ్రహణాలు రావటంచేత, హిందువులకు ఆధ్యాత్మికంగా స్నానాలు ఆచరించే, పై అమావాస్య రోజులు గ్రహణ రోజులు కావటం ఒక పుణ్యంగా భావించాలి.

మకర సంక్రాంతి పర్వదిన తదుపరి వచ్చే పుష్య అమావాస్య సూర్యగ్రహణ స్నానానికి మరో ప్రత్యేకం కూడా వుంది.... ఏమిటంటే 14.04.2010 మహా కుంభమేళ సప్త పవిత్ర స్నానాలలో....... ఈ పుష్య అమావాస్య గ్రహణ స్నానం ఒకటి కావటం మహా అదృష్టం. గనుక శ్రీ విరోధి నామ సంవత్సరం లో ఆషాఢ, పుష్య అమావాస్యలలో జగద్రక్షకుడైన శ్రీసూర్యభగవానుడికి రాహు కేతు గ్రస్తంగా గ్రహణాలు సంభవించిన కారణంగా...... మనమంతా లోక కల్యాణం కోసమే కాక మన మన వ్యక్తిగత సంరక్షణార్ధం కూడా భగవంతుడిని ఆరాధించవలసి వుంది....... ఎన్నో... ఎన్నెనో... ఆరాధనలు వున్నాయి. వాటితోపాటు చాలా సులువుగా వుండే ఓ చక్కని నాగారాధన ఈ విరోధి నామ సంవత్సరంలో మనం ఆచరించవలసి వుంది. ఏమిటంటే..

శ్రీ విరోదిలో దక్షిణాయనం ప్రారంభంకాగానే...... 19 జూలై 2009 చంద్ర నక్షత్రమైన రోహిణి ఆదివారం నుంచి 26 జూలై 2009 సూర్య నక్షత్రమైన ఉత్తర ఆదివారం మధ్యలో ......... 22వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది. 2 సూర్యవారాల మధ్యలో సూర్యగ్రహణం జరిగింది. ఇందుకుగానూ 26 జూలై 2009ఆదివారం నాడు ..... అంటే నాగపంచమి పర్వదినాన ......... నాగవల్లీ పత్రంతో నాగదేవతను ఆరాధించాలి .... నాగవల్లీ పత్రం అంటే....... క్రొత్తగా వుందని అనుకోవద్దండి..... నాగవల్లీ పత్రం అంటే నాగదేవత పేరుతో వున్నఓ పవిత్రమైన ఆకు. సకల శుభాకార్యాలలోనూ, భగవతారాధనలోనూ ఈ ఆకుకి ప్రముఖ స్థానం వుంది..... అదే తమలపాకు. ఆకు రూపం కూడా నాగ పడగలాగానే వుంటుంది.

గనుక, 26 ఆదివారం నాడు ఎనిమిది తమలపాకులను తీసుకొని, దానిపై మంచి తేనెను రాసి ... నాగదేవతను ఆరాధించే పుట్ట దగ్గరగానీ, నాగ ప్రతిమల వద్ద గానీ పై చిత్రంలో చూపిన విధంగా..... మధ్యలో పసుపు కుంకుమలను వుంచి, దానికి ఎనిమిది వైపులా తేనె రాసిన తమలపాకులను పెట్టి..... సూర్య భగవానుడి వైపు చూస్తూ మనసులోని కోర్కెను తెలియచేస్తూ నాగ దేవతకు ఈ ఎనిమిది ఆకులను నివేదించండి... అంతే ఆరాధన పూర్తి అయినది . ఇవిగాక ఇంకా ఇంకా మీరు నైవేద్యాలు సమర్పించాలంటే ...సమర్పించండి వానిలో ఎటువంటి మార్పు లేదు.... ఈ ఎనిమిది తేనె పూసిన ఆకులు మాత్రమే ఈ నాగపంచమికి ప్రత్యేకం.

ఎనిమిది ఆకులే ఎందుకు? తొమ్మిది వుంచవచ్చు కదా !!... అష్ట దిక్కులకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఎనిమిది ఆకులను వుంచుతున్నాం. ఓ సర్పదేవతకు తల భాగాన్ని రాహువుగానూ. తోక భాగాన్ని కేతువు గానూ పురాణ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా, పిలుచుకుంటాం. ఈ రాహు కేతు గ్రస్తాలతో ఏర్పడిన ఈ గ్రహణాలలో ప్రారంభంలోనే నాగపంచమి పర్వదినాన నాగవల్లీ పత్రంతో రాహు కేతువుల ప్రీతికి ఆరాధన చేసి, నాగదేవత కృపకు పాత్రులుకండి....... శ్రీనివాస గార్గేయ







Monday, July 20, 2009

గ్రహణం రోజున దైవ దర్శనమా ?


ఖగోళంలో గ్రహణాలు జరిగినప్పుడు మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయాలలో అర్చనలు లేకుండా ద్వారాలను మూసివుంచి, దర్శనాలను నిలిపి వేయుట ఆనవాయితీ. ఎందుకు ఇలా ఆలయాలను మూసివుంచాలి?



ఎందుకంటే.... జగద్రక్షకులైన సూర్యచంద్రులకు, గ్రహణములు సంభవించునపుడు యావత్ జాతి సూతకులగుదురు.

ఇట్టి సమయంలో ఆలయాలలో దైవ దర్శనాలను నిలిపి వేసి గర్భాలయములను మూసివుంచుట భారతీయ ధర్మశాస్త్ర శాసనము. దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా శ్రీ కాళహస్తి పట్టణం పంచభూత లింగాలలో వాయు లింగేశ్వరుడు గా వెలసిన దివ్య క్షేత్రమూ మరియు దక్షిణ కాశీగా పేరొందిన పవిత్ర పుణ్యదేవాలయంలో, సూర్య చంద్ర గ్రహణములు సంభవించే రోజులలో, గర్భాలయమును మూయక, భక్తులను దైవ దర్శనానికి అనుమతిస్తున్నారు.


దాదాపు ౩ వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన సంపూర్ణ గ్రహణము తిరిగి ఈ శతాబ్దపు (01.08.2008) పంచమ సంపూర్ణ సూర్య గ్రహణము గా, పంచగ్రహ కూటమితో, పంచకాల సర్పయోగాలకు నాందిపలికిన అశుభ సమయాన, ఎన్నో శతాబ్దాల క్రితం ఆదిశంకరులు ప్రతిష్ట చేసిన స్ఫటిక లింగం శ్రీ కాళహస్తి లో బీటలు వారటం, రెండు ప్రధాన శక్తి ఆలయాలలో(2008) వందల కొద్ది దుర్మరణం జరగటం పాఠకులకు తెలిసినదే.


సూర్యచంద్ర గ్రహణాల రోజున దైవ దర్శనాలను నిలపాలని, గర్భాలయాన్ని మూసివుంచాలని శాసించే ధర్మశాస్త్ర గ్రంధాలు ఎన్నో వున్నాయి కానీ గ్రహణాలలో శ్రీ కాళహస్తి గర్భాలయాన్ని మూయకూడదని, భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని చెప్పే వివరం, ఏ ధర్మశాస్త్ర గ్రంధంలో, లేక ఏ శైవాగమ గ్రంధంలో వున్నదో ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత శ్రీ కాళహస్తి దేవస్థాన పాలకమండలికి, పండితులకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు వుంది. కేవలం ఆలయ అర్చకులు చూపే ఏవో చిన్నిపాటి కారణాలు కాక, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ముక్కంటికి మచ్చ లేకుండా చేయాల్సిన అవసరం వుంది.


ఈ విరోధిలో ప్రధానంగా దక్షిణాయనం ప్రారంభమైన వారం రోజులకే 2009 జూలై 22 సంపూర్ణ సూర్య గ్రహణము, 15 జనవరి 2010 అతిపెద్ద కంకణ సూర్య గ్రహణము సంభవించనున్నది. ఉత్తరాయనము ప్రారంభమైన రెండవ రోజే కుంభమేళ పవిత్ర స్నాన సందర్భములో ఈ గ్రహణము ఓ ప్రపంచారిష్టం. ప్రజలు భయపడవలదని మా మనవి.


కనుక ఆయా రోజులలో శ్రీ కాళహస్తి దేవస్థానాన్ని తెరవకుండా వుంచి, భక్తులకు దర్శనాలను ఆపవలెనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారులకు వినయముగా తెలియజేయుచున్నాను. లేదా ఆలయాన్ని తెరవవచ్చు అని చెప్పే సరియైన సక్రమమైన అసలుసిసలైన ప్రామాణిక గ్రంధాన్ని చూపెట్ట వలసిన భాద్యత వున్నదని గుర్తుచేస్తున్నాను. ప్రజల క్షేమంకోరే ఈ వార్త వ్రాయటం జరిగింది. అంతేకాని ఆలయ పండితుల మీద అక్కసుకాదని గ్రహించేది. మీడియా ప్రభంజనం ఉన్న నేటి రోజులలో జనవిజ్ఞానవేదిక నుంచి వచ్చే సూటి ప్రశ్నలకు మనం కూడా ఖచ్చిత ప్రమాణాలను చూపించాల్సిన అవసరం వుంది. - శ్రీనివాస గార్గేయ.

Tuesday, July 7, 2009

కోటి రూపాయల బహుమతి


" గ్రహభూమి" పాఠకులకు నమస్కారములు.

కోటి రూపాయల బహుమతి ఏమిటని ఆశ్యర్యపోతున్నారా? ఈ రోజు జూలై 7 వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో TV9 స్టూడియోలో ఒక లైవ్ కార్యక్రమం లో ప్రకటించాను.
వివరాలలోకి వెళదాం.... వరుస మూడు గ్రహణాల వలన అరిష్టాలు వుంటాయా ? అనే కార్యక్రమం కోసం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు TV9 లో ప్రత్యక్ష కార్యక్రమంలో నేను, ప్లానేటరీ సొసైటీ కార్యదర్శి శ్రీ రఘునందన కుమార్ పాల్గొన్నాము.
నేను ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ................. మూడు రోజుల క్రిందట ప్రముఖ దినపత్రికలలో ఆగష్టు 7 న ప్రచ్చాయా చంద్రగ్రహణం సంభవిస్తుందని రఘునందన గారు పత్రికా ప్రకటన చేసారు. ఖగోళ శాస్త్ర సంబంధ విషయాలలో నిత్యం కుస్తీ పట్టే రఘునందన గారు చెప్పేది తప్పని... ప్రచ్చయా చంద్రగ్రహణం ఆగష్టు 7 కాదని, ఆగష్టు ఆరు గురువారం సూర్యోదయానికి పూర్వము 4 గంటల 34 నిమిషాలకు ప్రారంభమవుతుందని, జ్యోతిష్య శాస్త్ర రీత్యా తెలియచేస్తున్నానని, రఘునందన్ గారు తప్పుగా మాట్లాడుతున్నారని, లైవ్ కార్యక్రమంలో మాట్లాడాను.......
దీనికి రఘునందన్ గారు... ఆరు కానే కాదని, ముమ్మాటికీ ఆగష్టు 7 నే ప్రచ్చాయా చంద్ర గ్రహణం అని వాదిస్తున్నారు. ఆరునే గ్రహణం వుందని, కోటి రూపాయలు ఛాలెంజ్ అని చేసాను.... 7 వ తేదీ గ్రహణం పడితే ఒక కోటి రూపాయలు నేను ఇవ్వాలి. ఆరవ తేదీన గ్రహణం పడితే తాను నాకు కోటి రూపాయలు ఇచ్చే స్థితిలో లేదట. కేవలం ఓడిపోయిన వ్యక్తిగా ముద్రించుకుంటాడు. కానీ కోటి రూపాలతో నన్ను సిద్ధంగా వుండమని రఘునందన్ గారు చెప్పారు.అంటే తాను 7 వ తేదే గ్రహణం వున్నదని కోటి రూపాయలు నన్ను సిద్ధం చేసుకోనమని పలు సార్లు అన్నారు. నేను కార్యక్రమం చివరి వరకు ఆగష్టు ఆరునే గ్రహణం... ఏడు కాదని వాదిస్తున్నాను.

ఒక నెల రోజులు ఆగండి.... శాస్త్రం గెలుస్తుందో సైన్స్ గెలుస్తుందో అంటూ TV9 సమన్వయ కర్తగా వ్యవహరించిన బద్రి ముగింపు పలికాడు.
ఇది కాగానే... వెంటనే బంజారాహిల్స్ లోని మరొక టెలివిజన్ ఛానల్ I NEWS లో ఈ రోజు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు, మరొక గంటసేపు, నాకు రఘునందన్ గారికి మధ్య ప్రత్యక్ష ప్రసారంలో చర్చ జరిగినది. ఈ ఛానల్ లో నేను గంట సేపు మాట్లాడిన సారాంశం ఏమిటంటే .... ఆగష్టు ఆరు సూర్యోదయానికి పూర్వమే గ్రహణమున్నదని, 7 కాదని, ఏడున సంభవిస్తే.... దేశప్రజలందరికీ నేను లెంపలేసుకుంటూ క్షమాపణ చెబుతూ, రఘునందన్ కుమార్ గార్కి కోటి రూపాయలు ఇవ్వబోతున్నాను. అలాగాక ఆరునే గ్రహణం జరిగితే, తాను నాకు కోటి ఇవ్వలేని పరిస్థితి వుంటే.... దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పుకొమ్మని తెలియచేసాను.

గనుక పాఠకులందరికీ తెలియజేయునది ఏమనగా ఈ అగ్నిపరిక్షలో నేనే గెలవబోతున్నాను. రఘునందన్ కుమార్ ఓడిపోవటానికి సిద్ధంగా వున్నాడని మరోసారి తెలియచేస్తున్నాను....

నమస్కారములతో,
శ్రీనివాస గార్గేయ